భోపాల్: వైద్యులు రాసే మెడికల్ ప్రిస్క్రిప్షన్కు సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక కొత్త భాష్యం చెప్పారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్ను వైద్యులు ఇంగ్లిష్కు బదులుగా హిందీలో ఎందుకు రాయకూడదని ప్రశ్నించారు. క్రోసిన్ మందు రాయాలనుకున్నప్పుడు హిందీలో క్రోసిన్ అని రాస్తే వచ్చే సమస్య ఏముంటుందని అన్నారు. ఇక నుంచైనా వైద్యులు హిందీలోనే మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
భోపాల్లోని భారత్ భవన్లో జరిగిన హిందీ వ్యాఖ్యాన్ కార్యక్రమంలో పాల్గొన్న శివరాజ్సింగ్ చౌహాన్ తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్ను హిందీలో రాయడం మాత్రమే కాదని.. ప్రిస్క్రిప్షన్ పైభాగాన శ్రీహరి అని రాసి, కింద మందుల పేర్లు రాస్తే బాగుంటుందన్నారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని, అయితే జాతీయ భాష అయిన హిందీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనేది తన ఉద్దేశమని చెప్పారు.
ఇంగ్లిష్ లేకుండా ఏ పని చేయలేమనే మైండ్సెట్ నుంచి ప్రజలు బయటకు రావాలని సూచించారు. కొన్ని దేశాలు తమ జాతీయ భాషల్లోనే అన్ని పనులు చేసుకుంటున్నాయని, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎనలేని అభివృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు. రష్యా, జపాన్, జర్మనీ, చైనా దేశాల్లో ఇంగ్లిష్ ఎవరు మాట్లాడుతారని ఆయన వ్యాఖ్యానించారు. వారు తమ మాతృభాషల్లో అన్ని కార్యాలు చక్కబెట్టుకుంటారని అన్నారు. దేశంలో కూడా ఇంగ్లిష్కు బదులుగా హిందీని ఎక్కువగా వినియోగించాలని పేర్కొన్నారు.