న్యూఢిల్లీ: లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకోవడం నేరం కాదని రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan) చెప్పారు. మహిళా రెజ్లర్లు ఆయనపై చేసిన లైంగిక ఆరోపణలపై ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్, సహ నిందితుడు, సస్పెండైన డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్పై అభియోగాలు మోపాలా వద్దా అన్న దానిపై ఢిల్లీ కోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా న్యాయవాది రాజీవ్ మోహన్ ఆయన తరుఫున వాదనలు వినిపించారు. బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపు ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లు భయం వల్ల ఐదేళ్లుగా నోరువిప్పలేదనడం సరైన కారణం కాదని న్యాయవాది తెలిపారు. అలాగే దేశం బయట కొన్ని నేరాలు జరిగాయన్న ఆరోపణలపై దేశంలో విచారణ జరిపే అధికార పరిధి కోర్టుకు లేదన్నారు.
కాగా, కేవలం రెండు నేరాలు మాత్రమే దేశంలో జరిగాయని బ్రిజ్ భూషణ్ తరుఫు న్యాయవాది రాజీవ్ మోహన్ కోర్టుకు తెలిపారు. సిరి ఫోర్ట్లో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ, లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకోవడం నేరం కాదని అన్నారు. రెజ్లింగ్ వంటి క్రీడలకు మహిళా కోచ్లు తక్కువని, మగవారే ఎక్కువగా ఉంటారని తెలిపారు. విజయం సాధించినప్పుడు ఆ కోచ్ ఆనందంతో క్రీడాకారిణిని కౌగిలించుకోవడం నేరం కిందకు రాదని వివరించారు. వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.