న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: తనకు వ్యతిరేకంగా గత వారం నుంచి రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలపై బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్మంతర్లో ఆందోళన చేస్తే వారికి న్యాయం జరుగుతుందా! అంటూ వెటకారంగా మాట్లాడారు.
జంతర్మంతర్లో నిరసన తెలిపితే న్యాయం జరగదని, న్యాయం కావాలంటే పోలీసు స్టేషన్కో లేదా కోర్టుకో వెళ్లాలని అంటూ ఉచిత సలహా ఇచ్చారు. రెజ్లర్లు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయినా రెజ్లర్లు ఇప్పటి వరకు అటువంటివి చేయలేదని బ్రిజ్భూషణ్ పేర్కొనడం గమనార్హం.
మరోవైపు జంతర్మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన ఆదివారం కూడా కొనసాగింది. మన్ కీ బాత్ అంటూ మాటలు చెప్పే ప్రధాని మోదీ.. తమ ‘మన్ కీ బాత్’ కూడా వినాలని వారు కోరారు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని భజరంగ్ పునియా స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న రెజ్లర్ల డిమాండ్లు ప్రధాని వినాలని వినేశ్ పొగట్ అభ్యర్థించారు. ‘ప్రధాని మోదీ మా మన్ కీ బాత్ కూడా వినాలి. దేశంలోని కోట్ల మంది ప్రజలు మాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది మా పోరాట బలం’ అని పేర్కొన్నారు.