న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై (Wrestler Bajrang Puina) చర్యలు చేపట్టాలని కోరుతూ ఆందోళన చేపట్టిన రెజ్లర్లతో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం సమావేశమయ్యారు. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం ప్రముఖ రెజ్లర్ భజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు. జూన్ 15లోగా పోలీసుల విచారణ పూర్తవుతుందని కేంద్ర మంత్రి తమకు హామీ ఇచ్చారని తెలిపారు.
రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకోవాలని తాము కోరామని చెప్పారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అందుకు అంగీకరించారని తెలిపారు. జూన్ 15లోగా చర్యలు చేపట్టకుంటే తమ నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రెజ్లర్లపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకోవాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు.
డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను ఈనెల 30లోగా నిర్వహిస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. జూన్ 15లోగా రెజ్లర్లు ఎలాంటి నిరసనలు చేపట్టరాదని రెజ్లర్లతో భేటీ అనంతరం మంత్రి పేర్కొన్నారు. రెజ్లర్లతో తాను ఆరు గంటల పాటు సంప్రదింపులు జరిపానని, ఈ నెల 15లోగా విచారణ ముగుస్తుందని ఈ సందర్భంగా తాను వారికి హామీ ఇచ్చానని తెలిపారు. విచారణ అనంతరం చార్జిషీట్లు దాఖలు చేస్తారని చెప్పారు. ఇక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని వారు కేంద్ర మంత్రి ముందు పట్టుపట్టినట్టు సమాచారం.
Read More
Odisha Train Accident | పరిహారం కొట్టేసేందుకు కొత్త తరహా మోసం.. చనిపోయింది మా వాళ్లే అంటూ డ్రామాలు