న్యూఢిల్లీ: వివిధ అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ను పలు సందర్భాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. తాజాగా ఇవాళ కూడా సీబీఐ ఓ అవినీతి కేసు విచారణలో భాగంగా లాలూను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉద్దేశించి లాలూ కుమార్తె రోహిణి ఆచార్య కీలక వ్యాఖ్యలు చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని తరచూ కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే తాను ఎవ్వరినీ విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. లాలూ రెండో కుమార్తె అయిన రోహిణి అచార్య ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. ‘నా తండ్రిని హింసించడం కరెక్ట్ కాదు. ఇదంతా గుర్తే ఉంటుంది. కాలం చాలా శక్తిమంతమైనది’ అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
‘నా తండ్రికి ఇప్పుడు 74 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ ఢిల్లీలో అధికార పీటాన్ని గడగడలాడించే సత్తా ఆయనలో ఉంది. ప్రస్తుతం సహనం పరీక్షలు ఎదుర్కొంటున్నది’ అంటూ రోహిణి అచార్య మరో ట్వీట్ చేశారు. గత డిసెంబర్లో ఆమె తన తండ్రికి కిడ్నీ దానం చేశారు. సింగపూర్లో లాలూకు కిడ్నీ మార్పిడి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో తన పెద్ద కుమార్తె మీసా భారతి ఇంట్లో లాలూ యాదవ్ ఉన్నారు.
సీబీఐ అధికారులు ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ను, ఆయన సతీమణి రబ్రీదేవిని ప్రశ్నించారు. సోమవారం రబ్రీదేవిని ప్రశ్నించగా.. ఇవాళ లాలూను విచారించారు. ఈ కేసులో లాలూ దంపతులతోపాటు వారి కుమార్తెలు మీసా భారతి, హేమ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భూములు ఇచ్చి ఉద్యోగాలు పొందిన 12 మంది ఉద్యోగుల పేర్లను కూడా ఈ కేసులో చేర్చారు.