బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు పదనుపెట్టాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతున్నదని, దేశంలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులే ఇక్కడ బీజేపీని గెలిపిస్తాయని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
దీనిపై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. ప్రధాని మోదీని చూసి కర్ణాటక ప్రజలు బీజేపీకి ఓటేస్తారు అంటే.. బీజేపీ స్థానిక నాయకత్వం లేదన్నట్టేనని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే ప్రధాని మోదీ నేరుగా కర్ణాటకను పాలిస్తాడా..? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు స్థానిక నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కొదవలేదని వ్యాఖ్యానించారు.