భోపాల్: గుంతలమయమైన రోడ్డుపై ఆ ప్రాంత మహిళలు క్యాట్వాక్ చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘటన జరిగింది. ధనవంతులు నివాసం ఉండే డానిష్ నగర్లోని హోషంగాబాద్ రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. వర్షం నీటితో గుంతలు నిండి ఉన్నాయి. దీంతో పిల్లలు, పెద్దలు కొన్నిసార్లు పడిపోతున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
దీంతో అధికారుల దృష్టిని ఆకట్టుకునేందుకు స్థానిక మహిళలు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. వర్షం నీటితో నిండిన గుంతల రోడ్డుపై క్యాట్వాక్ చేశారు. మధ్యప్రదేశ్ రోడ్లు అమెరికా రోడ్ల కంటే బాగా ఉన్నాయని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 2017లో అన్న మాటలకు కౌంటర్ ఇచ్చారు. ‘వాషింగ్టన్ రోడ్ల కంటే బాగా ఉన్న రోడ్లు ఇవే’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే పన్నుల చెల్లింపు నిలిపివేస్తామని, ఎన్నికల్లో ఓటు వేయబోమని ఈ కార్యక్రమం నిర్వాహకురాలు అన్షు గుప్తా హెచ్చరించారు.
మరోవైపు నీటితో నిండిన గోతుల రోడ్డుపై మహిళలు, బాలికల క్యాట్వాక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ ఆఫీసర్ నీలేష్ శ్రీవాస్తవ దీనిపై స్పందించారు. స్థానికుల నుంచి తమకు ఫిర్యాదు అందలేదని, మీడియా ద్వారా ఇది తెలిసిందని చెప్పారు. సివిల్ ఇంజినీర్ను అక్కడికి పంపి రోడ్డుపై ఏర్పడిన గోతులను పూడ్చుతామని చెప్పారు.