తిరువనంతపురం: విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐ మహిళా నాయకురాలితోపాటు పోలీస్ అధికారిపై డ్రగ్ మాఫియా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి సంబంధించి 40 మంది వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మెప్పాడిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థిని, ఎస్ఎఫ్ఐ నాయకురాలు అపర్ణా గౌరిపై శుక్రవారం ఆ కాలేజీలో దాడి జరిగింది. స్థానిక డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న సుమారు 20 మందికిపైగా విద్యార్థులు ఆమెతోపాటు పోలీస్ ఇన్స్పెక్టర్ విబిన్పై దాడి చేశారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో అపర్ణ స్పృహ కోల్పోయింది. ఇన్స్పెక్టర్ విబిన్కు ఎముకలు విరిగాయి. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ హింసాత్మక సంఘటనకు సంబంధించి 40 మంది వ్యక్తులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులపై దాడి చేసిన 20 ఏళ్ల అలాన్ ఆంటోనీతోపాటు అపర్ణా గౌరీపై దాడి చేసిన కిరణ్ రాజ్, అతుల్, షిబ్లీ, అబిన్ అనే నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. వారిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా పోలీసు కస్టడీకి అప్పగించింది.
మరోవైపు స్థానిక డ్రగ్ మాఫియా ఆ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ విమర్శించింది. దీనిని మానుకోవాలని అపర్ణా నేతృత్వంలోని తమ సంఘం వారిని హెచ్చరించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం ఎన్నికలను సమన్వయం చేసేందుకు కాలేజీకి వచ్చి భోజనం చేస్తున్న అపర్ణాపై డ్రగ్స్ మాఫియాకు చెందిన వారు దాడి చేశారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.
Comrade Aparna, district joint secretary of SFI in Wayanad, Kerala was brutally attacked by drug mafia in her college (Govt. Polytechnic College, Meppadi). This shocking murder attempt has not alerted the so-called 'mainstream media' in Kerala! pic.twitter.com/27ouWd7qqi
— V P Sanu (@VP_Sanu) December 3, 2022