చండీగఢ్: ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడ్ని గొంతునొక్కి తల్లి చంపింది. (Woman Strangles Son) అనారోగ్యంతో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం గురించి తెలియడంతో ఆ బాలుడ్ని ఆమె హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి చెందిన దంపతులైన అరవింద్ కుమార్, పూనమ్ దేవి, సిర్హౌల్లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 8 ఏళ్ల కుమారుడు అనారోగ్యంతో చనిపోయినట్లు 28 ఏళ్ల పూనమ్ దేవి ఏడ్చింది. దీంతో పొరుగువారు ఆ ఇంటి వద్ద గుమిగూడారు.
కాగా, కూలి పనులు చేసే అరవింద్ కుమార్ ఈ విషయం తెలుసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. అచేతనంగా పడి ఉన్న కుమారుడ్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే ఆ బాలుడి గొంతు వద్ద గాయాలు ఉండటంతో గొంతు నొక్కి హత్య చేసినట్లు అనుమానించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అరవింద్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా తొలుత గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తులో తల్లి పూనమ్ దేవిపై వారు అనుమానించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కుమారుడ్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నది. ఎందుకు హత్య చేసిందో అన్నది ఆమె వెల్లడించలేదు. అయితే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం గురించి తెలియడంతో కుమారుడ్ని ఆమె హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.