తిరువనంతపురం: దంపతుల మధ్య గొడవ నేపథ్యంలో కోపంతో వదిలి బైక్పై వెళ్తున్న భర్తను భార్య వెంబడించింది. అయితే దొంగను ఆమెను ఛేజ్ చేస్తున్నట్లు భావించిన స్థానికులు, పోలీసులు ఆమె వెనుకే పరుగులు తీశారు. విస్తూ పోయే ఈ సంఘటన కేరళలో జరిగింది. పతనంతిట్టకు చెందిన దంపతులు బైక్పై అజూర్ ప్రాంతానికి వెళ్లారు. అయితే వారిద్దరూ అక్కడ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహించిన భర్త బైక్ దిగమని భార్యకు చెప్పాడు. ఆమె దిగడంతో భార్యను వదిలి కోపంతో బైక్పై అక్కడి నుంచి వెళ్లసాగాడు. దీంతో ఆ మహిళ అతడ్ని వెంబడించింది.
కాగా, బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఒక మహిళ పరుగెత్తుతూ వెంబడించడాన్ని పలువురు మగవాళ్లు చూశారు. ఆమె చైన్ లేదా బ్యాగ్ చోరీ చేసి అతడు పారిపోతున్నట్లు భావించారు. వారు కూడా అతడ్ని ఛేజ్ చేశారు. మరోవైపు ట్రాఫిక్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు దీనిని గమనించారు. దీంతో వారు కూడా వెంబడించారు. ఇలా ఎక్కువ మంది ఆ వ్యక్తి వెంటపడటంతో అజూర్ పోలీస్ స్టేషన్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
చివరకు స్థానికులు ఆ మహిళను ఆపి ఏం జరిగిందని అడిగారు. దీంతో వారంతా వెంబడిస్తున్న సంగతిని ఆమె గ్రహించింది. అయితే ఏం జరిగిందో చెప్పేందుకు ఆ మహిళ జంకింది. చివరకు పోలీసులు గట్టిగా అడగ్గా అసలు విషయం చెప్పింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి తన భర్త అని తెలిపింది. తమ మధ్య గొడవ జరుగడంతో కోపంతో తనను వదలి వెళ్లిపోయినట్లు ఆమె వెల్లడించింది. ఇది తెలుసుకున్న స్థానికులు, పోలీసులు నోరెళ్లబెట్టారు.