Uttar Pradesh | లక్నో, డిసెంబర్ 8: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు. అత్యంత కిరాతకంగా ఓ మహిళను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు, ఆమె మొహాన్ని సిగరెట్లతో కాల్చి.. ఆ తర్వాత గొడ్డలితో నరికిచంపాడు. సుల్తాన్పూర్ జిల్లాలో డిసెంబర్ 3న చోటుచేసుకున్న ఈ ఘటనలో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ఉద్యోగం కోసం సూరజ్కుమార్ సోన్కర్ అనే వ్యక్తి ఓ మహిళకు కొంతమొత్తం నగదు ముట్టజెప్పాడు.
ఈ వ్యవహారంలో ఆమె తన మాట నిలుపుకోలేకపోయింది. సోన్కర్కు ఉద్యోగం రాలేదు. తన డబ్బులు తనకు వెంటనే ఇచ్చేయాలని సోన్కర్ డిమాండ్ చేయగా, కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరింది. ఇందుకు అంగీకరించని సోన్కర్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అత్యంత పాశవికంగా ఆమె ముఖాన్ని సిగరెట్లతో కాల్చాడు. అనంతరం గొడ్డలితో ఆమెను నరికిచంపాడు. మృతదేహాన్ని తీసుకొచ్చి సుల్తాన్పూర్లో ఓ రోడ్డుపై పడేశాడని పోలీసులు తెలిపారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణహత్యకు పాల్పడ్డ సోన్కర్ వాడిన ఈ-రిక్షా, మొబైల్ ఫోన్, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.