తిరువనంతపురం : జాతీయ బాలల దినోత్సవం రోజున కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. పాలక్కడ్ జిల్లా మంజాకన్దాత్కు చెందిన దివ్యకు అనిరుధ్(4), అభినవ్(1) అనే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. గత కొన్నాళ్ల నుంచి దివ్యకు తన భర్తతో గొడవలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో దివ్య శనివారం రాత్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేసింది. ఆ తర్వాత ఆమె కూడా నిద్ర మాత్రలు మింగి నరాలను కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దివ్య భర్త రాజేశ్ నానమ్మ కూడా నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ముసలావిడకు ఎలాంటి ప్రాణప్రాయం లేదని వైద్యులు తెలిపారు. దివ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.