చెన్నై : తన అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్న భర్తను బాయ్ ఫ్రెండ్తో కలిసి హతమార్చింది ఓ భార్య. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కంచీపురం జిల్లాలో జులై 28న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సోమమంగళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమలారాణి(37) దంపతులు. గత కొద్ది కాలం నుంచి రాణి.. ఓ యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ గొడవల నేపథ్యంలో భర్తను చంపాలని భార్య నిర్ణయించుకుంది. దీంతో జులై 28న రాత్రి తన బాయ్ ఫ్రెండ్ను ఇంటికి పిలిపించుకుంది. భర్త నిద్రిస్తున్న సమయంలో అతనిపై కత్తితో దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని మరో ప్రాంతానికి తరలించి నిప్పంటించారు.
అదెంచెరి కనిపించకపోవడంతో జులై 29న అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదెంచెరితో పాటు అతని భార్య, కుమారుడు కూడా కనిపించలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అదెంచెరి తండ్రి.. రాణికి ఫోన్ చేసి తమ కుమారుడు ఎక్కడ? అని ప్రశ్నించాడు. స్పందించిన రాణి.. తన కుమారుడు ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు.. ఇప్పుడు మాట్లాడటం కుదరదు అని దాటవేసింది. మొత్తానికి రాణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
ఈ కేసు విచారణలో భాగంగా రాణి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. సోమమంగళం గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో మృతదేహాన్ని పడేసినట్టు తొలుత చెప్పింది. అక్కడ శవం లభించకపోవడంతో మళ్లీ పోలీసులు ఆమెను విచారించారు. చెంగల్పట్టులోని అడవుల్లో అదెంచెరి మృతదేహానికి నిప్పు పెట్టామని తెలుపడంతో.. అక్కడి పోలీసుల సహాయంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భర్తను చంపిన తర్వాత అతని మృతదేహం అక్కడే ఉంచి.. రాణి, ఆమె ప్రియుడు బెడ్రూమ్లోనే 12 గంటల పాటు గడిపారు. ఆ తర్వాత డెడ్బాడీని చెంగల్పట్టు తీసుకెళ్లి నిప్పంటించినట్లు రాణి తెలిపింది. ఈ కేసులో రాణి ప్రియుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.