గౌహతి: ఒక మహిళ తన భర్త, అత్తను హత్య చేసింది. మృతదేహాలను పలు ముక్కలుగా నరికింది. కొన్ని రోజుల పాటు ఫ్రిజ్లో దాచింది. ఆ తర్వాత వాటిని పాలిథిన్ కవర్లలో ఉంచి మూరుమూల ప్రాంతంలో పడేసింది. ఆపై భర్త, తన అత్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. అస్సాం రాజధాని గౌహతిలో ఈ సంఘటన జరిగింది. నూన్మతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన బందన కలితకు ధంజిత్ దేకా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఏడు నెలల కిందట ప్రియుడు, మరో స్నేహితుడు అరూప్ దాస్తో కలిసి భర్త అమరేంద్ర దే, అత్త శంకరి దేని హత్య చేసింది. ఆ తర్వాత ఆ ముగ్గురూ కలిసి మృతదేహాలను పలు ముక్కలుగా నరికారు. మూడు రోజులపాటు ఫ్రిజ్లో ఉంచారు. అనంతరం మృతదేహాల ముక్కలను పాలిథిన్ కవర్లలో ఉంచి పొరుగున ఉన్న మేఘాలయలోని అటవీ ప్రాంతంలో పడేశారు.
కాగా, కలిత ఆ మరునాడు తన భర్త, అత్త కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఎలాంటి సమాచారం వారికి లభించలేదు. కొన్ని నెలల తర్వాత అమరేంద్ర సోదరుడు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోదరుడు, తల్లి అదృశ్యం వెనుక కలిత ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు.
మరోవైపు కొన్ని ఆధారాలు లభించడంతో శుక్రవారం కలితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త, అత్త అదృశ్యంపై ఆమెను ప్రశ్నించారు. దీంతో వారిని హత్య చేసినట్లు ఆమె చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆదివారం మేఘాలయా ప్రాంతంలో వెతకగా కొన్ని శరీర భాగాల ముక్కలు పోలీసులకు లభించాయి. ఈ నేపథ్యంలో కలిత, ఆమె ప్రియుడు, మరో వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.