పాట్నా: బస్సులో ప్రయాణించిన మహిళను కొందరు వ్యక్తులు లైంగికంగా వేధించారు. దీంతో వారి బారి నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న బస్సు నుంచి బయటకు దూకింది. రోడ్డుపై పడిన ఆమె తీవ్రంగా గాయపడింది. బీహార్లోని పూర్ణియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ వైశాలి నుంచి సిలిగురికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అయితే కదులుతున్న బస్సులో కొందరు వ్యక్తులు ఆమెను లైంగికంగా వేధించారు. దీంతో తనను తాను కాపాడుకునేందుకు ఆమె బస్సు నుంచి దూకింది.
కాగా, మంగళవారం మధ్య రాత్రి తర్వాత రోడ్డుపై తీవ్ర గాయాలతో మహిళ పడి ఉండటాన్ని కొందరు చూశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయమైన ఆ మహిళ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మరోవైపు ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పూర్ణియా జిల్లా ఎస్పీ తెలిపారు.