Manipur : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఒక వేడుకలా చేసుకున్నారు. మనదేశంలో మణిపూర్లోని ఫుట్బాల్ ఫ్యాన్స్ కూడా వీధుల్లోకి వచ్చి గట్టిగా అరుస్తూ సంబురాలు చేసుకున్నారు. అయితే.. సింగజమే వాంగ్మా భేగపాటి ప్రాంతంలో రాత్రి 11ః30 గంటలకు జరిగిన ఫిఫా సెలబ్రేషన్స్లో విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీ పేల్చడంతో ఒక బుల్లెట్ తగిలి 50 ఏళ్ల మహిళ చనిపోయిందని పోలీసులు సోమవారం తెలిపారు. మృతురాలిని లైష్రం ఓంగ్బి ఇబెటాంబిగా గుర్తించారు. బుల్లెట్ ఆమె వీపులోకి దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు. ఏ వైపు నుంచి బుల్లెట్ వచ్చింది అనేది తెలుసుకునేందుకు పోలీసులు, ఫొరెన్సిక్ బృందం దర్యాప్తు చేపట్టింది. మరోవైపు కాల్పులకు పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసేంత వరకు అంత్యక్రియలు చేపట్టబోమని ఇబెటాంబి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
‘ఫైనల్లో గెలిచి అర్జెంటీనా ట్రోఫీ సాధించడంతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. బాణాసంచా పేలుడు చప్పుడుతో పాటు తుపాకీ చప్పుడు కూడా వినిపించింది అంతేకాదు తమ ఇంటి మొదటి అంతస్తులో రెండు బుల్లెట్ షెల్స్ పడి ఉన్నాయ’ని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు. వరల్డ్ కప్ మ్యాచ్ అనంతరం కేరళలోని అర్జెంటీనా, ఫ్రాన్స్ అభిమానులు గొడవకు దిగారు. ఈ సంఘటనలో ముగ్గురు కత్తిపోటుకు గురయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్పై గెలుపొందింది.