మేదినీనగర్: భర్త కళ్లముందే భార్యపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ అత్తగారింట్లో గొడవపడి హైవే రోడ్డు వెంట నడుచుకుంటూ తల్లిగారింటికి వెళ్తుండగా మోటార్ సైకిళ్లపై వచ్చిన ఆరుగురు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. జార్ఖండ్ రాష్ట్రం పలాము జిల్లాలోని సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోగల బకోరియా భలూవాహి లోయలో ఈ ఘటన జరిగింది.
గత శనివారం సాయంత్రం 22 ఏండ్ల మహిళ అత్తతో గొడవపడింది. అనంతరం అలిగి హైవే 39పై నడుచుకుంటూ తల్లిగారింటికని బయలుదేరింది. అనంతరం ఆమెను వెతుక్కుంటూ ఓ బంధువుతో కలిసి భర్త బైక్పై వెళ్లిండు. వాళ్లు ఆమెను చేరుకునే సరికి చీకటయ్యింది. భర్త ఇంటికి వెళ్దాం రమ్మంటే, ఆమె రానని మొండికేసింది.
అదే సమయంలో మూడు బైక్లపై అటుగా వచ్చిన ఆరుగురు మహిళ భర్తను, బంధువును తీవ్రంగా కొట్టిపడేశారు. అనంతరం ఆమెను పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా… ఆమెను తీసుకెళ్తున్న బైక్ మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సందర్భంగా స్థానికులు గుమికూడటంతో మహిళ ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది.
దాంతో స్థానికులు బైక్పై ఉన్న ఇద్దరినీ చితకబాదారు. అనంతరం భర్త జరిగిన విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఇద్దరినీ, ఇవాళ మిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మహిళను మేదినీనగర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.