అహ్మదాబాద్: ఒక మహిళ పదేళ్లలో తన భర్తను ఏడుసార్లు అరెస్ట్ (Husband Arrest) చేయించింది. అయితే ప్రతిసారి సెక్యూరిటీ కింద డబ్బులు ఏర్పాటు చేసి బెయిల్ ద్వారా అతడ్ని విడిపించింది. విస్తూపోయే ఈ సంఘటన గుజరాత్లోని మెహసానా జిల్లాలో జరిగింది. ప్రేమ్చంద్ మాలి, సోను దంపతులు కడి టౌన్లో నివసిస్తున్నారు. 2001లో వారికి వివాహమైంది. కొన్నేళ్లపాటు బాగానే ఉన్నారు. 2014 నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా పోట్లాట, వాగ్వాదం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో భర్త ప్రేమ్చంద్ తనపై భౌతికంగా దాడి చేశాడంటూ భార్య సోను 2015లో తొలిసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు భార్యకు ప్రతినెలా రూ.2,000 భరణం చెల్లించాలని ఆదేశించింది.
కాగా, రోజువారీ కూలీగా పని చేసే ప్రేమ్చంద్, భార్య సోనుకు భరణం కింద ఆ డబ్బులు చెల్లించడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యలంలో భార్య ఫిర్యాదుతో అతడు మరోసారి అరెస్ట్ అయ్యాడు. ఐదు నెలలపాటు జైలులో ఉన్నాడు. అయితే ఆశ్చర్యకరంగా భర్త విడుదల కోసం భార్య రంగంలోకి దిగింది. సెక్యూరిటీ డిపాజిట్ను కూడా ఆమె సమకూర్చింది. దీంతో బెయిల్పై అతడు విడుదలయ్యాడు. ఆ తర్వాత వారిద్దరూ విడివిగా నివసించారు. అయినప్పటికీ ఆ దంపతుల మధ్య వాగ్వాదం, పోట్లాట దూరంకాలేదు. కొంతకాలం తర్వాత వారిద్దరూ కలిసి జీవించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో భార్య ప్రతిసారి గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడ్ని అరెస్ట్ చేసేవారు. 2016 నుంచి 2018 వరకు ఇది కొనసాగింది. భరణం చెల్లించకపోవడం వల్ల 2019, 2020లో కూడా అతడు అరెస్ట్ అయ్యాడు. అయితే భార్య సోను ప్రతిసారి బెయిల్ ద్వారా భర్తను విడిపించింది.
మరోవైపు భరణం చెల్లించకపోవడంపై ప్రేమ్చంద్ను ఈ ఏడాదిలో కూడా మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య సోను బెయిల్ ఇప్పించగా జూలై 4న జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం భార్యభర్తలు కడి ప్రాంతంలో కలిసి ఉంటున్నారు. అయితే తన పర్సు, మొబైల్ ఫోన్ మాయమైనట్లు ప్రేమ్చంద్ ఇటీవల ఆరోపించాడు. వాటిని తీయలేదని భార్య సోను వాదించింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణ మరోసారి వారిద్దరి మధ్య కోట్లాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రేమ్చంద్ ఇంటిని వీడి వెళ్లిపోయాడు. పాట్నాలోని తల్లి వద్దకు చేరుకున్నాడు. అంతేగాక భార్య సోను, కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు తనను కొట్టి హింసిస్తున్నారని ఆరోపించాడు. భార్య ఫిర్యాదుల వల్ల పదేళ్లలో ఏడుసార్లు తాను అరెస్ట్ అయినట్లు వాపోయాడు.