లక్నో: కూతురు మామగారితో కలిసి ఒక మహిళ పారిపోయింది. ఇంట్లోని నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన వియ్యంకుడు, వియ్యపురాలి కోసం వెతుకుతున్నారు. (Woman Elopes With Daughter’s Father-In-Law) ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 43 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు. ఆమె భర్త లారీ డ్రైవర్. దీంతో అతడు చాలా కాలం ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో కుమార్తె మామగారైన 46 ఏళ్ల శైలేంద్ర, మమత మధ్య ఏడాదిగా సంబంధం ఏర్పడింది. భర్త లేనప్పుడు వియ్యంకుడైన అతడ్ని తన ఇంటికి పిలిపించేది.
కాగా, ఏప్రిల్ 11న వియ్యంకుడు శైలేంద్రకు మమత ఫోన్ చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, విలువైన వస్తువులను తీసుకుని అతడితో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మమత భర్త, శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వియ్యంకుడు, వియ్యపురాలి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారి ఆచూకీని గుర్తించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.