భోపాల్: నిండు గర్భిని ప్రసవం కోసం దవాఖానకు వచ్చింది. డాక్టర్లు ఆమెకు నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. దీపావళి (Diwali) కావడంతో బయట అంతా పటాకులు (fireworks) కాలుస్తున్నారు. ఈ సంతోషాన్ని తామెందుకు మిస్సావలని అనుకున్నారో ఏమో.. లేబర్ రూమ్ సిబ్బంది పురుడు కోసం మంచంపై ఉన్న ఆ మహిళను వదిలేశారు. దవాఖాన ఆవరణలో పటాకులు కాలుస్తూ సంతోషంలో మునిగిపోయారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ మహిళ కన్నుమూసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో జరిగింది.
26 ఏండ్ల మహిళ గురువారం రాత్రి పురుడు కోసం బుందేల్ఖండ్ మెడికల్ కాలేజీ, దవాఖానకు వెళ్లింది. కాన్పుకు సమయం కావడంతో.. వైద్యులు ఆమెకు పురిటి నొప్పుల కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఆమెను లేబర్ రూమ్లోనే వదిలి.. దవాఖాన ఆవరణలో పటాకులు కాలుస్తూ గడిపారు. దీంతో పరిస్థితి విషమించి ఆమె మృతిచెందింది. అయితే ఈ వీడియో స్థానిక మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయింది.
ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సును సస్పెండ్ చేశారు. డాక్టర్కు షోకాజ్ నోటిసు జారీచేశారు. వీరితోపాటు మెటర్నిటీ వార్డులో (Maternity ward) ఐదుగురు ట్రైనీ డాక్టర్లను విధుల నుంచి తొలగించారు.
కాగా, దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యంతో తన భార్య మృతిచెందిందని బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య బాబుకు జన్మనిచ్చి మరణించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఈ వ్యవహారంపే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.