చండీగఢ్: ఒక వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్యను వేధించసాగాడు. ఈ క్రమంలో రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో చలికి తాళలేక ఆ మహిళ మరణించింది. (woman dies due to cold) ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. సుందర్పూర్ గ్రామానికి చెందిన మంగత్ రామ్తో 28 ఏళ్ల పూనమ్కు తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. అయితే అదనపు కట్నం కోసం భార్యను అతడు వేధిస్తున్నాడు. జనవరి 28న రాత్రి మద్యం సేవించిన మంగత్ రాయ్ తన భార్యతో గొడవపడ్డాడు. రెండు లక్షలు కట్నం తీసుకురావాలని ఆమెను కొట్టాడు. ఆపై పూనమ్ను బలవంతంగా ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు.
కాగా, రాత్రంతా ఇంటి బయట చలిలో ఉన్న పూనమ్ తెల్లవారుజామున మరణించింది. ఈ విషయం తెలిసిన ఆమె సోదరుడు హేమంత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పూనమ్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. భర్త వెళ్లగొట్టడంతో రాత్రంతా ఇంటి బయట ఉన్న ఆ మహిళ చలికి తాళలేక చనిపోయిందా లేదా అన్నది పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలుస్తుందని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.