భోపాల్: ఒక మహిళ లింగ మార్పిడి చేసుకుని పురుషుడిగా మారింది. చాలా కాలంగా స్నేహం చేస్తున్న స్నేహితురాలిని పెళ్లాడింది. ఫ్యామిలీ కోర్టులో జరిగిన ఈ ప్రత్యేక వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ సంఘటన జరిగింది. అల్కా సోని అనే మహిళ కొంత కాలం తర్వాత తాను స్త్రీ కాదని గ్రహించింది. నాటి నుంచి మగవాడిగా జీవించడం ప్రారంభించింది. 47వ పుట్టిన రోజున ధైర్యం చేసి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. పురుషుడిగా మారిన ఆమె తన పేరును
అస్తిత్వ సోనిగా మార్చుకుంది. అలాగే చాలా కాలంగా స్నేహం చేస్తున్న స్నేహితురాలైన ఆస్తాను పెళ్లాడింది. ఫ్యామిలీ కోర్టులో జరిగిన ఈ ప్రత్యేక వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గురువారం పెళ్లి ధృవీకరణ పత్రాన్ని వారు అందుకున్నారు.
కాగా, అస్తిత్వ సోని పురుషుడిగా మారకముందు స్నేహితురాలైన ఆమె సోదరి ద్వారా తనకు పరిచయం ఏర్పడినట్లు వధువు ఆస్తా తెలిపింది. అనంతరం తమ మధ్య అనుబంధం ప్రేమగా మారినట్లు చెప్పింది. అల్కా సోని పురుషుడిగా మారిన తర్వాత ఇండోర్ కలెక్టర్ను కలిసి తమ పరిస్థితి వివరించి స్పెషల్ మ్యారేజ్కు దరఖాస్తు చేసినట్లు తెలిపింది. అనుమతి లభించడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకున్నట్లు చెప్పింది. సోమవారం తామిద్దరం హిందూ సంప్రదాయ పద్ధతిలో మరోసారి పెళ్లి చేసుకుంటామని వెల్లడించింది.
మరోవైపు ట్రాన్స్జండర్ వ్యక్తుల వివాహాలకు సంబంధించి సుప్రీంకోర్టు అక్టోబర్లో కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత చట్టాలతో సహా ఇప్పటికే ఉన్న చట్టాలను అనుసరించి నేరుగా రిలేషన్షిప్లో ఉన్న ట్రాన్స్జెండర్ వ్యక్తులు వివాహం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.