పనాజీ, జనవరి 9: బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో నాలుగేండ్ల కుమారుడిని కిరాతకంగా హత్య చేసింది. మృతదేహాన్ని బ్యాగ్లో కుక్కి, ట్యాక్సీలో గోవా నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు ప్రయాణించింది. ఈ దారుణ ఘటన సోమవారం చోటుచేసుకొన్నదని గోవా పోలీసులు మంగళవారం వెల్లడించారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి.. 39 ఏండ్ల నిందితురాలు సుచన సేథ్ను కర్ణాటకలోని చిత్రదుర్గలో సోమవారం రాత్రి అరెస్టు చేశారు.
మంగళవారం ఆమెను గోవా తీసుకొచ్చి స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. ఆరు రోజుల కస్టడీకి అప్పగించింది. భర్త వెంకట్ రామన్తో సుచన సేథ్ కొన్నేండ్లుగా దూరంగా ఉంటుంది. వీరిద్దరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నట్టు సమాచారం. భర్తతో విభేదాల కారణంగానే సుచన సేథ్ కుమారుడిని చంపి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అసలు కారణం దర్యాప్తు తర్వాత వెల్లడవుతుందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఉత్తర గోవాలోని కందోలిమ్లో ఓ రెంటెడ్ సర్వీస్ అపార్ట్మెంట్లో ఈ నెల 6న దిగిన సుచన సేథ్.. సోమవారం ట్యాక్సీలో కర్ణాటక వెళ్లింది. అయితే ఆ సమయంలో ఆమెతో పాటు తన కుమారుడు కనిపించకపోవడం, పెద్ద బరువైన బ్యాగ్ను మోసుకుంటూ తీసుకెళ్లడంతో అనుమానం వచ్చిన అపార్ట్మెంట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారని కలంగుట్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ పరేశ్ నాయక్ వెల్లడించారు.
Also Read : రూమ్లో దగ్గు సిరప్ బాటిళ్లు.. ప్రణాళిక ప్రకారమే కొడుకు మర్డర్
వేగంగా స్పందించిన పోలీసులు
కుమారుడిని హత్య చేసిన ఆ కసాయి తల్లి కట్టు కథలు అల్లింది. వారు ఉన్న ఫ్లాట్ను పోలీసులు పరిశీలించారు. అక్కడ కనిపించిన రక్తపు మరకలపై పోలీసులు బెంగళూరు వెళ్తున్న ఆమెకు ఫోన్ చేసి ప్రశ్నించగా.. అవి తన నెలసరి వల్ల ఏర్పడ్డాయని, కుమారుడు తన స్నేహితురాలి వద్ద ఉన్నాడని చెప్పుకొచ్చింది.
ఒక అడ్రస్ కూడా ఇచ్చింది. అయితే అది ఫేక్ అని తేల్చిన పోలీసులు బెంగళూరుకు వెళ్తున్న ట్యాక్సీ డ్రైవర్కు ఇన్స్పెక్టర్ పరేశ్ నాయక్ ఫోన్ చేసి మాట్లాడారు. అప్పటికి వాళ్లు చిత్రదుర్గకు చేరుకోగా.. అనుమానం రాకుండా ఆమెను సమీప పోలీసుస్టేషన్కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ బ్యాగ్ను చిత్రదుర్గ పోలీసులు పరిశీలించగా.. అందులో బాలుడి మృతదేహం ఉన్నది. వెంటనే కలంగుట్ నుంచి చేరుకొన్న పోలీసు బృందం నిందితురాలిని అదుపులోకి తీసుకొన్నది.