న్యూఢిల్లీ: మహిళా క్యాన్సర్ రోగిని అమెరికా విమాన సిబ్బంది బలవంతంగా విమానం నుంచి దించేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ సంఘటనపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. క్యాన్సర్తో బాధపడుతున్న మీనాక్షి సేన్గుప్తా ఇటీవల సర్జరీ చేయించుకున్నది. జనవరి 30న ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఎక్కింది. సర్జరీ వల్ల చేతులతో బరువు మోయలేని స్థితిలో ఆమె ఉన్నది. మీనాక్షి ధరించిన ట్యాగ్ చూసి గ్రౌండ్ సిబ్బంది ఎంతో సహకరించారు. ఆమెను విమానంలోకి ఎక్కించడంతోపాటు హ్యాండ్ బ్యాగ్ను ఆమె సీటు వద్ద ఉంచారు. తొలుత విమాన సిబ్బంది కూడా ఆ హ్యాండ్బ్యాగ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
కాగా, విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ఎయిర్ హోస్టెస్ మీనాక్షి వద్దకు వచ్చింది. ఆమె వద్ద ఉన్న బ్యాగ్ను పైన ఉన్న అరలో ఉంచాలని చెప్పింది. తన అసహాయతను వ్యక్తం చేసి మీనాక్షి, ఆమె సహాయం కోరింది. అయితే ఆమె హ్యాండ్ బ్యాగ్ను పైన ఉన్న అరలో పెట్టేందుకు ఆ ఎయిర్ హోస్టెస్ నిరాకరించింది. ఇది తన పని కాదని చెప్పింది. మీనాక్షి పలుమార్లు బతిమాలినా కూడా ఆమె పట్టించుకోలేదు.
దీంతో మీనాక్షి విమాన సిబ్బందికి దీనిపై ఫిర్యాదు చేసింది. అయితే చాలా అసౌకర్యంగా అనిపిస్తే విమానం నుంచి దిగిపోవాలని వారు ఖరాఖండీగా చెప్పారు. దీంతో మీనాక్షి విమానం దిగిపోయింది. వీల్చైర్ కోరినప్పటికీ వారు ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. తాను ఎదుర్కొన్న ఈ సంఘటనపై పౌర విమానయాన శాఖకు, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు మీనాక్షి ఫిర్యాదుపై డీజీసీఏ స్పందించింది. అమెరికన్ ఎయిర్లైన్స్ సంస్థ నుంచి వివరణ కోరింది. అయితే విమాన సిబ్బంది సూచనలు పాటించకపోవడంతో ఒక కస్టమర్ను విమానం నుంచి దించేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ కస్టమర్ను తమ సిబ్బంది సంప్రదించారని, టికెట్లో కొంతమేర తిరిగి చెల్లించినట్లు చెప్పింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.