చెన్నై : పేలుళ్ల భయం వెంటాడుతున్నా పిల్లలకు తిండి పెట్టేందుకు ప్రమాదకర పరిస్ధితుల మధ్య పనిచేయకతప్పడం లేదని శివకాశీ పటాకుల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు వాపోతున్నారు. గత ఏడాది పటాకుల ఫ్యాక్టరీల్లో జరిగిన పేలుళ్లలో 39 మంది కార్మికులు మరణించడంతో పటాకుల్లో బేరియం వాడకంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. సుప్రీం నిర్ణయంతో పటాకుల ఉత్పత్తి పడిపోవడం పటాకుల తయారీదారుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియకున్నా పొట్టపోసుకునేందుకు ఈ వృత్తిలో కొనసాగుతున్నామని చాలా కాలం నుంచి శివకాశిలోని పటాకుల యూనిట్లో పనిచేస్తున్న కస్తూరి (56) చెప్పుకొచ్చారు.
ఇంటి వద్ద పటాకులు తయారు చేస్తూ తాను ఇద్దరు కుటుంబసభ్యులను కోల్పోయానని ఆమె గుర్తుచేసుకున్నారు. కఠిన నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత తమకు ఇంటికి మెటీరియల్ ఇవ్వడం లేదని, ఫ్యాక్టరీలోనే పనిచేయిస్తున్నారని అన్నారు. తాను ఓ కూతురు, ముగ్గురు మనవళ్లు, మనవరాళ్లను పోషించాల్సి ఉందని, తాను పనిచేయకపోతే కుటుంబం ఇబ్బందుల పాలవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాను, తన భర్త పటాకుల పరిశ్రమలో పనిచేస్తున్నామని ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రం తిరిగి రాగానే ఈ రోజు బతికిపోయామని ఆనందించాల్సిన పరిస్ధితి నెలకొందని విజయలక్ష్మి (37) చెబుతున్నారు.
పేలుళ్ల భయం మధ్యే పటాకుల తయారీలో నిమగ్నమవుతున్నామని, తమకు మరో దారి లేదని ఆమె పేర్కొన్నారు. రిస్క్లు ఉన్నా పిల్లల భవిష్యత్ కోసం తమకు ఈ పని తప్పడం లేదని, పరిశ్రమ కూడా బాగుంటేనే తమ బతుకులు బాగుంటాయని లక్ష్మి అనే మరో కార్మకురాలు అన్నారు. ఇబ్బందులు చుట్టుముట్టినా ఈ వృత్తిపై ఆధారపడి శివకాశిలో 6.5 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. బేరియం వాడకం నిషేధం సహా ఇటీవలి పరిణామాలతో లక్షన్నర మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.