న్యూఢిల్లీ: ఐటీ నిబంధనల సవరణ ముసాయిదాను ఉపసంహరించుకోవాలని ‘ది ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ’ (ఐఎన్ఎస్) మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ఐటీ శాఖ గత వారం జారీచేసిన కొత్త సవరణ ముసాయిదా ప్రకారం.. ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్.. ఫేక్గా నిర్ధారించిన న్యూస్ లేదా సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలు తమ ఫ్లాట్ఫాంల నుంచి తొలగించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను తనిఖీ చేసే బాధ్యతలను దాని సొంత ఏజెన్సీకి అప్పగించడం, చట్టం చేసి అధికారం ఇవ్వడం సరికాదని ఐఎన్ఎస్ పేర్కొన్నది. సవరణల ద్వారా విమర్శలు, న్యాయమైన వ్యాఖ్యానాలను కూడా అణచివేసేందుకు అడుగులు వేయడం ఆందోళనకరమని అభిప్రాయపడింది. మీడియాలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు సంబంధించిన నివేదికల వాస్తవిక ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంతో పాటు సరైన ప్రక్రియ, అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు ఒక యంత్రాంగాన్ని రూపొందించేందుకు సంబంధిత భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరపాలని కేంద్ర ఐటీ శాఖను కోరింది. ఐటీ రూల్స్కు కొత్త సవరణలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మంగళవారం కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాసింది.