సాబరకాంఠ, ఆగస్టు 5: ఆ తల్లి పేగు ఎంత తల్లడిందిందో.. ఆ తండ్రి మనసు ఎంత క్షోభకు గురైందో.. కానీ ఆ పాపం మూటకట్టుకోక తప్పలేదు. సుతారంగా చేతుల్లోకి తీసుకుని అల్లారుముద్దుగా చూసుకోవాల్సి పసిగుడ్డును.. తమ చేతులతోనే పూడ్చి పెట్టాల్సి వస్తుందని వాళ్లు ఎప్పుడూ ఊహించి ఉండరు. కానీ మరో దారి లేదు.. నెలలు నిండకముందే బుజ్జి తల్లి భూమిపైకి వచ్చింది. పాపను బతికించుకోవాలంటే బోలెడంత డబ్బు కావాలి. అసలే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం.. దవాఖాన ఖర్చులకు భయపడి.. దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ అమానవీయమైన ఘటన ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని సాబరకాంఠ జిల్లాలో చోటుచేసుకున్నది.
నెలలు నిండకముందే..
భిలోడా తాలూకా నందసన్ గ్రామానికి చెందిన శైలేష్ అహ్మదాబాద్లో వ్యవసాయ కూలీగా పనిచేస్తుండే వాడు. కొద్ది నెలలుగా పని దొరక్క పోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. గర్భవతి అయిన భార్య మంజులకు పోషకాహారం అందించలేక గంభోయి గ్రామంలోని అత్తాగారింటికి వెళ్లారు. అయితే బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఏడున్నర నెలలకే మంజుల ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే నెలలు నిండకముందే పుట్టడంతో పాప ఆరోగ్యం బాగోలేదు. దవాఖానకు తీసుకెళ్లాలంటే డబ్బులు లేక పూడ్చి పెట్టాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. ఊరి బయట పొలాల్లో పూడ్చిపెట్టారు. అయితే ఉదయం పొద్దుపోయాక పొలాలకు వచ్చిన కొందరు రైతులు శిశువు చేయి బయటకు కనిపించడంతో వెంటనే తవ్వి పాపను తీశారు. అయితే అదృష్టం కొద్ది శిశువు ఊపిరితోనే ఉండటంతో హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తరలించారు. పాపకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
డ్రైనేజీ గుంతలో పడి బాలిక మృతి
గుజరాత్లోని మెహసనా జిల్లా విస్నగర్లో సైకిల్పై వెళ్తున్న 14 ఏండ్ల బాలిక డ్రైనేజీ గుంతలో పడిపోయింది. శుక్రవారం బడి నుంచి ఇంటికి వస్తుండగా చిన్నపాటి వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మార్గమధ్యలో ఓ డ్రైనేజీ గుంత మూత తెరిచి ఉన్నది. దీంతో బాలిక అందులో పడిపోయి మరణించింది. ఈ దారుణ ఘటన వైద్యారోగ్య, నీటిసరఫరా మంత్రి రిషికేశ్ పటేల్ నియోజకవర్గంలో జరిగింది.
ఎన్నికైన మహిళలకు బదులు
ఇంట్లోని మగాళ్ల ప్రమాణం
భోపాల్, ఆగస్టు 5: బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ సర్కారు మధ్యప్రదేశ్లో ఎన్నికైన మహిళలకు బదులు వారి ఇంట్లోని పురుషులు వచ్చి ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్లో రెండు వారాల కిందట పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అక్కడి సాగర్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీకి మొత్తం 21 మంది (1 సర్పంచ్, 20 మంది వార్డు మెంబర్లు) ఎన్నికయ్యారు. వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. కానీ, అందులో ఏడుగురు మహిళలకు బదులు వారి బంధువులు వచ్చి ప్రమాణం చేశారు.
ప్రధానితో మమత భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలో దాదాపు గంటసేపు ఈ భేటీ జరిగింది. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మమత కోరారు. ఈ బకాయిలను సమయానికి విడుదల చేయకపోవడంతో రాష్ట్రంపై భారం పడుతున్నదని, చొరవ తీసుకొని నిధులు విడుదలయ్యేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు. అయితే నిత్యం ప్రధానిపై విమర్శలు గుప్పించే మమత.. ఉన్నంట్టుండి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.