బెంగళూరు: నకిలీ ప్రమాదాన్ని సాకుగా చూపిన ఒక జంట రైతును బెదిరించి కొట్టింది. 2.5 టన్నుల టమాటా లోడ్ లారీని ఆ రైతు నుంచి హైజాక్ చేశారు (Tomato Lorry Hijack). రైతు ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు టమాటా లారీని ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు. రహదారులపై చోరీలకు పాల్పడే ముఠాకు చెందిన ఆ జంటను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 8న హిరియూరు ప్రాంతానికి చెందిన రైతు మల్లేష్ 2.5 లక్షలకు పైగా విలువైన 2.5 టన్నుల టమాటాలను లారీలో కోలార్కు తరలిస్తున్నాడు.
కాగా, సొంతంగా లారీ నడుపుతున్న రైతు మల్లేష్ను కారులో వచ్చిన భార్యాభర్తలు చిక్కజాల వద్ద అడ్డుకున్నారు. అతడు తమ కారును ఢీకొట్టి దానికి నష్టం కలిగించినట్లు నాటకం ఆడారు. డబ్బుల కోసం ఆ రైతును బెదిరించారు. రైతు మల్లేష్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ దంపతులు, మరో ముగ్గురు కలిసి అతడ్ని కొట్టారు. అనంతరం లారీ నుంచి బయటకు తోసేశారు. 2.5 లక్షలకు పైగా విలువైన 2.5 టన్నుల టమాటాలున్న లారీని హైజాక్ చేశారు. దానిని నడుపుకుంటూ వెళ్లిపోయారు.
మరోవైపు, టమాటా లారీ చోరీకి గురికావడంతో ఆందోళన చెందిన రైతు మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు స్పందించారు. టమాటా లారీ కదలికలను ట్రాక్ చేసి దానిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన 28 ఏళ్ల భాస్కర్, అతడి భార్య అయిన 26 ఏళ్ల సింధుజాను శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రహదారులపై దోపిడీలు చేసే ఆ ముఠాకు చెందిన మరో ముగ్గురు వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.