ముంబై: కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒక బ్రాహ్మణుడిని మహారాష్ట్ర సీఎంగా చూడాలనుకుంటున్నా’ అని అన్నారు. పరశురామ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని జల్నాలో మంగళవారం రాత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో బ్రహ్మణులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఒకరు కోరారు. దీనికి కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే స్పందించారు. ‘బ్రాహ్మణులను కార్పొరేటర్లుగా లేదా పౌరసంఘాల అధిపతులుగా చూడడం నాకు ఇష్టం లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బ్రాహ్మణుడిని చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. రాజకీయాల్లో కులతత్వం ఎక్కువగా ఉన్నదని, దానిని విస్మరించలేమని తెలిపారు. అయితే అన్ని సంఘాలను కలుపుకొని పోయే నాయకుడు రావాలన్నారు.
కాగా, కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే చేసిన ఈ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వద్ద ఒక జర్నలిస్ట్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఆయన ఎవరైనా సీఎం కావచ్చని తెలిపారు. 145 మంది ఎమ్మెల్యేల మెజారిటీ సాధిస్తే ట్రాన్స్జెండర్ లేదా ఏ కులం, మతానికి చెందిన వ్యక్తి లేదా మహిళ అయినా ముఖ్యమంత్రి కావచ్చని వ్యాఖ్యానించారు.