ముంబై: మహారాష్ట్రలోని సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలో వైన్ అమ్మకాలకు అక్కడి మహాకూటమి ప్రభుత్వం అనుమతించడంపై ప్రతిపక్ష బీజేపీ గగ్గోలు పెడుతున్నది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అధికార కూటమిలోని శివసేన పార్టీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందించారు.
సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలో వైన్ అమ్మకాలకు అనుమతిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని రౌత్ సమర్థించారు. వైన్ అంటే లిక్కర్ కాదని, వైన్ అమ్మకాలు పెరిగితే రాష్ట్ర రైతులకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. వైన్ అమ్మకాలు పెరుగడంవల్ల ఆ వైన్ ఉత్పత్తికి అవసరమయ్యే పంటలకు డిమాండ్ పెరుగుతుందని, దాంతో రైతులకు లాభం జరుగుతుందని అన్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతో బీజేపీ తప్పుడు విమర్శలు చేస్తున్నదని, వాళ్లకు రైతుల గురించి ఏమాత్రం ఆందోళన లేదని సంజయ్ రౌత్ విమర్శించారు.