ముంబై: చనిపోయిన భర్త పెన్షన్, రెండో భార్యకు వస్తుందా? రాదా? అన్న దానిపై బాంబే హైకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది. మొదటి పెళ్లిని చట్టబద్ధంగా రద్దు చేయకుండా రెండో పెళ్లి చేసుకున్న సందర్భాల్లో చనిపోయిన భర్త పెన్షన్ పొందేందుకు రెండో భార్యకు అర్హత లేదని బుధవారం తీర్పునిచ్చింది. తనకు రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలను నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
మహాదేవ్ అనే వ్యక్తి షోలాపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్యూన్గా పనిచేసి 1996లో మరణించాడు. అయితే మొదటి భార్య ఉండగానే ఆయన షోలాపూర్కు చెందిన షామల్ తాటే అనే మహిళను రెండో పెండ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మహాదేవ్ మరణాంతరం ఆయన మొదటి భార్య, రెండో భార్య షామల్ మధ్య రాజీ కుదిరింది. పదవీ విరమణ ప్రయోజనాల్లో దాదాపు 90 శాతం తొలి భార్యకు, నెల వారీ పెన్షన్ రెండో భార్య పొందేలా వారిద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు.
అయితే కొంత కాలానికి మహాదేవ్ తొలి భార్య కూడా క్యాన్సర్తో చనిపోయింది. ఈ నేపథ్యంలో భర్త మరణాంతరం రావాల్సిన ప్రయోజనాలు, పెన్షన్ బకాయిల కోసం రెండో భార్య షామల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే అన్ని అంశాలు పరిశీలించిన ప్రభుత్వ అధికారులు 2007 నుంచి 2014 వరకు ఆమె చేసిన నాలుగు విన్నపాలను తిరస్కరించారు.
దీంతో 2019లో బాంబే హైకోర్టును షామల్ ఆశ్రయించింది. మహదేవ్ వల్ల తనకు ముగ్గురు సంతానమని, తాము భార్యభర్తమన్నది సమాజానికి కూడా తెలుసని పేర్కొంది. తొలి భార్య కూడా మరణించినందున భర్త పెన్షన్ పొందేందుకు తాను పూర్తిగా అర్హురాలినంటూ పిటిషన్ వేసింది.
బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఎస్జే కథావల్లా, మిలింద్ జాదవ్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ జరిపింది. అయితే హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి వివాహాన్ని చట్టబద్ధంగా ముగించకుండా చేసుకునే రెండో వివాహం చెల్లుబాటు కాదని, అనేక సుప్రీంకోర్టు తీర్పులు దీనిని నిర్ధారించాయని కోర్టు గుర్తు చేసింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య మాత్రమే కుటుంబ పెన్షన్కు అర్హులన్న ప్రభుత్వం వాదన సరైనదేనని ధర్మాసనం పేర్కొంది.
మహదేవ్ మొదటి భార్యతో జరిగిన ఒప్పందం ప్రకారం, నెలవారీ పెన్షన్పై తన హక్కులను ఆమె స్పష్టంగా వదులుకున్న విషయాన్ని గుర్తు చేసింది. అలాగే పిటిషనర్ దీని గురించి నిబంధనల మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మరణించిన భర్త పెన్షన్ రెండో భార్య అయిన ఆమెకు వర్తించదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఆమె రిట్ పిటిషన్ను కొట్టివేసింది.