న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని స్కూళ్లకు కరోనాపై మార్గదర్శకాలు జారీ చేస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యా మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థి, టీచర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతోపాటు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగడంపై గురువారం ఆయన స్పందించారు. కరోనా వల్ల ఎవరూ కూడా ఆసుపత్రుల్లో చేరలేదని, దీని గురించి భయందోళన చెందాల్సిన అవసరం లేదని మీడియాతో అన్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాతో కలిసి జీవించడాన్ని మనం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో కరోనా పరిస్థితిని నిరంతం పరిశీలిస్తున్నామని మనీష్ సిసోడియా తెలిపారు. తమ పిల్లలకు కరోనా సోకినట్లుగా కొందరు తల్లిదండ్రులు స్కూళ్లకు సమాచారం ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించి స్కూళ్లకు మార్గదర్శకాలను శుక్రవారం జారీ చేస్తామని చెప్పారు.
మరోవైపు దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి, ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్గా గురువారం తేలింది. దీంతో విద్యార్థులందరినీ ఇంటికి పంపినట్లు ఆ స్కూల్ యాజమాన్యం తెలిపింది. కరోనా సోకిన విద్యార్థి, టీచర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. కాగా, గురువారం అంబేద్కర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే, శనివారం ఈస్టర్ తర్వాత ఆదివారం సెలవుల నేపథ్యంలో వరుసగా నాలుగు రోజులు స్కూళ్లు మూతపడనున్నాయి.