Anupriya Patel | ఉత్తరప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ సంచలన నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని అప్నా దళ్ అధినేత, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ఓ ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శనివారం చెప్పారు. 2017 ఎన్నికల్లో 11 స్థానాల్లో పోటీ చేసింది అప్నాదళ్ పార్టీ. 2017 ఎన్నికల్లో 11 స్థానాల్లో పోటీ చేస్తే తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. తాము ఏయే స్థానాల్లో పోటీ చేయాలో ఒకటి, రెండు రోజుల్లో ఖరారు చేస్తామని అనుప్రియా పటేల్ తెలిపారు.
తూర్పు యూపీలో కుర్మీ సామాజిక వర్గంలో అప్నాదళ్కు మద్దతు ఉంది. ప్రస్తుతం యూపీలో బీజేపీ అతిపెద్ద మిత్రపక్షం అప్నాదళ్. 2014 ఎన్నికల్లో బీజేపీ 80 స్థానాలకు 71 స్థానాల్లో విజయం సాధిస్తే, అప్నాదళ్ మరో రెండు స్థానాల్లో గెలుపొందింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.
2019 లోక్సభ ఎన్నికల ముంగిట బీజేపీ మిత్రపక్షాలను పట్టించుకోవడం లేదని, కూటమి నుంచి వైదొలుగుతామని అప్నాదళ్ బెదిరించింది. రాష్ట్రంలోనూ సీఎం యోగి ఆదిత్యనాథ్ మిత్ర పక్షాల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదని అనుప్రియా పటేల్ భర్త, అప్నాదళ్ నాయకుడు ఆశీశ్ పటేల్ ఆరోపించారు. కేంద్ర బీజేపీ నాయకత్వం జోక్యం చేసుకోవాలని అప్పట్లో డిమాండ్ చేశారు.