లక్నో: భూ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో దళితులు, పేదలకు ఇండ్లు నిర్మిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ సురేష్ కుమార్ త్రిపాఠి లేవనెత్తిన ఒక ప్రశ్నకు సీఎం ఆదిత్యనాథ్ సమాధానమిచ్చారు. 2017లో తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొందరు కబ్జా చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను స్వాధీనం చేసుకోవడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ ఇప్పటి వరకు 67,000 ఎకరాల రెవెన్యూ శాఖ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించిందని తెలిపారు. ల్యాండ్ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న ఈ భూముల్లో దళితులు, పేదలకు ఇండ్లు నిర్మిస్తామని వెల్లడించారు.
మరోవైపు క్రీడా మైదానాలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, పంచాయితీ స్థాయిలో వీటిని ఏర్పాటు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రవేశపెట్టిన పథకం కింద విద్యార్థులకు లాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 28 శాతానికి పెంచామని, ఈ ఏడాది జూలై నుంచి ఇది అమలవుతుందన్నారు. మహిళా సంక్షేమం గురించి మాట్లాడే ప్రతిపక్షంలోని కొందరు సిగ్గులేకుండా తాలిబన్లకు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.