మీరట్: నిద్రమాత్రలిచ్చి, ఆపై బెడ్ మీదకు విషసర్పాన్ని వదిలి ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. తన ప్రియునితో కలసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ హత్యను ప్రమాదవశాత్తూ జరిగిన పాముకాటుగా చిత్రీకరించి, అతనిపై ఉన్న రూ. 20 లక్షల జీవిత బీమాను కాజేసేందుకు ఈ కుట్ర పన్నింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది. మీరట్ జిల్లాలోని హస్తినాపూర్లో తన భార్యతో పాటు అతుల్ పన్వార్ ఒక ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నాడు. ఈ కేసు గురించి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ) అవినాష్ పాండే మాట్లాడుతూ అతుల్ నడుపుతున్న స్కూలులో తుషార్ అనే వ్యక్తి గత మూడు నెలలుగా బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడని, దామినితో అతను వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడని దర్యాప్తులో తేలిందన్నారు. అతుల్ పన్వార్కు నిద్ర మాత్రలు ఇచ్చి, అతను స్పృహ కోల్పోయాక, అతను పడుకున్న మంచంపైకి దామినితో పాటు నిందితులు ఒక విష సర్పాన్ని వదిలారు.
ఈ ఘటనలో అతుల్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతని మృతిపై అనుమానం వ్యక్తం చేసిన అతుల్ కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. విచారణ సమయంలో పాము కాటు వల్ల సంభవించిన మరణం అయితే అది ప్రమాదవశాత్తూ జరిగినదిగా కనిపిస్తుందని, అందుకే తాము విషపూరితమైన పామును సేకరించామన్నారు. ఈ పామును నిందితులకు సోను, ఉదయ్ అనే పాములు ఆడించేవారు అందించినట్లు దర్యాప్తులో తేలింది. విచారణ సమయంలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. కాగా ఈ హత్య వెనుక రెండు కారణాలున్నాయని, అతుల్ను తొలగించుకుని తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని దామిని, తుషార్ భావించారని, అలాగే అతుల్ మరణాన్ని పాము కాటుతో జరిగినదిగా చిత్రీకరిస్తే, తమకు అతనిపై ఉన్న రూ. 20 లక్షల బీమా మొత్తం అందుతుందని నిందితులు భావించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.