భారత రాజ్యాంగ సభ 1949 నవంబరు 26న భారత రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించింది. నూతన రాజ్యాంగ ప్రతిపై 1950 జనవరి 24న రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారు. కానీ, రెండు రోజుల తర్వాత.. జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నెహ్రూ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని జనవరి 26 నుంచి అమలు చేయడానికి ఓ బలమైన కారణముంది.
జనవరి 26.. భారత దేశ చరిత్రనే మలుపు తిప్పిన రోజు. భారత జాతీయ కాంగ్రెస్ ‘పూర్ణ స్వరాజ్’ తీర్మానం చేసిన లాహోర్ సమావేశం జరిగింది ఇదే రోజున. లాహోర్లో 1930 జనవరి 26న జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో బ్రిటిష్ పాలకులు భారత్ నుంచి వైదొలగాలని డిమాండ్ చేసింది. ఆ సందర్భంగా లాహోర్లో రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాబోయే స్వాంతంత్య్ర దినోత్సవానికి సంకేతంగా ప్రకటించారు. అప్పటి నుంచి జనవరి 26న సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ జాతీయ పతాకం ఎగురవేస్తున్నారు.
నెహ్రూ.. లాహోర్లో ఎగురవేసిన మువ్వన్నెల జెండా పింగళి వెంకయ్య రూపొందించినదే. భారత దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించేందుకు సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిన లాహోర్ సమావేశాలు జరిగిన జనవరి 26నే నెహ్రూ ప్రభుత్వం ఎంచుకుంది.