న్యూఢిల్లీ: పెగాసస్ ( Pegasus ) స్నూపింగ్ కేసులో సుప్రీంకోర్టు పలు పిటీషన్లను పరిశీలిస్తున్నది. అయితే ఆ కేసులో ఇవాళ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం దాన్ని సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఎవరూ తమ హద్దుల్ని దాటవద్దు అని, ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. ఇవాళ విచారణ సమయంలో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా పాల్గొన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండాలని పిటిషనర్లతో సీజే అన్నారు. కోర్టులో కేసు వాదనలు జరుగుతుంటే, పిటిషనర్లు సోషల్ మీడియాలో సమాంతర చర్చలు చేపట్టడం దేనికి అని కోర్టు ప్రశ్నించింది. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, కోర్టులో చెప్పండి అంటూ సీజే పేర్కొన్నారు. ఒకసారి మీరు కోర్టుకు వస్తే, అప్పుడు కోర్టులో సమగ్రమైన చర్చ జరుగుతుందన్నారు.
కోర్టు పర్యవేక్షణలో పెగాసస్పై విచారణ చేపట్టాలని పలువురు సుప్రీంలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ పెగాసస్తో రాజకీయవేత్తలు, కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ మీడియా కథనాల్లో వచ్చిన విషయాలు వాస్తవమే అయితే, అప్పుడు పెగాసస్ వ్యవహారం చాలా తీవ్రమైందే అని గత తీర్పులో సీజే ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపైనట్లు తెలిస్తే, క్రిమినల్ ఫిర్యాదు ఎందుకు ఇవ్వలేదని కూడా ఆయన పిటిషనర్లను అడిగారు.
లైవ్ వెబ్కాస్ట్కు డిమాండ్..
ఇక పెగాసస్ వ్యవహారంలో జరిగే కోర్టు విచారణను లైవ్లో ప్రసారం చేయాలని జ్యుడిషియల్ అకౌంటబులిటీ అండ్ రిఫార్మ్స్ సంస్థ కోరింది. ఈ నేపథ్యంలో సీజే రమణకు లేఖ కూడా రాసింది. పెగాసస్ స్నూపింగ్ కేసు విచారణను లైవ్లో వెబ్ ద్వారా ప్రసారం చేయాలని ఎన్జీవో సీజేఏఆర్ కోరింది.