న్యూఢిల్లీ : బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి కరోనా వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ ప్రశ్నించారు. తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు తీసుకోవడం పట్ల సుశీల్ మోదీ ఆక్షేపించారు. రష్యా వ్యాక్సిక్ స్పుత్నిక్ వీ భారత్కు వచ్చే వరకూ ఇద్దరు సోదరులూ వేచిచూశారని వారికి దేశీ వ్యాక్సిన్ పట్ల విశ్వాసం లేదని ఆరోపించారు. ఆర్జేడీ నేతలు గతంలోనూ కొవిషీల్డ్, కొవ్యాక్సిన్ సామర్ధ్యాన్ని ప్రశ్నించారని అన్నారు.
లాలూ యాదవ్, రబ్రీ దేవి ఇంతవరకూ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదని ఆయన నిలదీశారు. తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లు తమ తల్లితండ్రులు వ్యాక్సిన్ వేసుకునేలా నచ్చచెప్పాలని సుశీల్ మోదీ హితవు పలికారు. లాలూ ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకుంటే ఆ విషయం ప్రజలకు తెలియపరచాలని ఇది ప్రజల్లో వ్యాక్సినేషన్ పట్ల స్ఫూర్తి కలిగిస్తుందని అన్నారు. తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్లు ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే బాగుండేదని పేర్కొన్నారు.