River Linkage | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: సమగ్ర అధ్యయనం లేకుండా దేశంలో నదుల అనుసంధానం చేపడితే లాభాల కంటే నష్టాలే ఎక్కువని పరిశోధకులు హెచ్చరించారు. అవగాహన లేమితో అనుసంధానం చేస్తే రుతు పవనాలకు అంతరాయం ఏర్పడి దేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని వల్ల దేశంలో నీటి ఎద్దడి అధికమవుతుందని తెలిపారు. అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతాంగం ఇబ్బందులు పడవచ్చని హెచ్చరించారు. ఈ మేరకు ఐఐటీ-బాంబే, పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ ఎల్నినో సదరన్ ఆస్కిలేషన్ (ఈఎన్ఎస్వో) తదితర వాతావరణ మార్పులపై అధ్యయనం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు కూడా అధ్యయనంలో పాల్గొన్నారు.
నదుల అనుసంధానం కారణంగా నీటి బదిలీ వల్ల గాలి, తేమ ప్రభావితమై నేల-వాతావరణం దెబ్బతింటుంది. తద్వారా ఎక్కువ వర్షపాతం ఉండే బేసిన్ పరిధిలోనూ వర్షాభావ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ప్రాజెక్టులపై అధ్యయనం చేసిన తర్వాతే నదుల అనుసంధానాన్ని చేపట్టాలని పరిశోధకులు సూచించారు.