న్యూఢిల్లీ: రూ.6000 కోట్ల టోల్ ట్యాక్స్ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సెనాను ఆప్ ప్రశ్నించింది. ఈ స్కామ్కు సంబంధించిన పత్రాలతో సహా ఎల్జీకి 2 నెలల క్రితమే ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఫిర్యాదు చేశారని పేర్కొన్నది. ఈ కుంభకోణంలో బీజేపీ నేతల ప్రమేయం ఉన్నందున దర్యాప్తుకు ఆదేశించే ధైర్యం సక్సేనా లేదా అని ఆప్ నేత దుర్గేశ్ పాఠక్ నిలదీశారు.
ఢిల్లీ ఎల్జీ సక్సేనాపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ చురకలు వేశారు. ఎల్జీలాగా తనను తన భార్య కూడా తిట్టలేదని వ్యంగ్యాస్త్రం సంధించారు. గడిచిన ఆరు నెలల్లో ఎల్జీ తనకు రాసినన్ని ప్రేమలేఖలు తన భార్య కూడా రాయలేదని చమత్కిరించారు. ‘ఎల్జీగారూ కాస్త చల్లబడండి.. మీ సూపర్ బాస్ (కేంద్ర సర్కారు)ను కూడా కాస్త కూల్ అవ్వమనండి’ అంటూ చురకలు వేశారు. వివిధ అంశాలపై విమర్శలు చేస్తూ ఎల్జీ లేఖలు రాసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.