Uttarakhand Polls | ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ అసెంబ్లీ స్థానంలో 21 ఏండ్లుగా మహిళలే ఎన్నికవుతున్నారు. 2000లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఈ స్థానం నుంచి మహిళలే గెలుస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌరి గడ్వాల్ జిల్లాలోని యమకేశ్వర్ అసెంబ్లీ స్థానంలో 90 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారిలో 42 వేల మంది మహిళలు.
2002 -2012 మధ్య మూడుసార్లు బీజేపీ అభ్యర్థి విజయ బర్త్వాల్ గెలుపొందారు. అంతే కాదు బీజేపీ నేతలు బీసీ ఖండూరీ, రమేశ్ పొఖ్రియాల్ నిశాంఖ్ సారధ్యంలోని ప్రభుత్వాల్లో మంత్రిగానూ పని చేశారు. 2017 ఎన్నికల్లో మాజీ సీఎం బీసీ ఖండూరీ తనయ రితూ ఖండూరీ కూడా బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ సారి రేణు బిష్తుకు బీజేపీ టికెట్ కేటాయించింది.
2017లో రితూ ఖండూరిపై స్వతంత్ర అభ్యర్థిగా రేణు బిష్తు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రేణు.. ఆరుగురు పురుషులను ఢీ కొడుతున్నారు. ఈసారి ఆమె విజయం సాధిస్తే.. యమకేశ్వర్ పూర్తిగా మహిళలకు కంచుకోటగా మారుతుందంటున్నారు. జనాభా పరంగా పలు ప్రాంతాల్లో మహిళలు ఎక్కువైనా రాజకీయంగా వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తున్నది.