న్యూఢిల్లీ: ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్(Hardeep Singh Nijjar)ను కెనడాలో హత్య చేశారు. జూన్లో ఆ మర్డర్ జరిగింది. అయితే ఆ హత్య పాత్రలో భారత్ హస్తం ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేశారు. మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ నేత హత్యా ఘటన ఇప్పుడు రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది. నిజ్జార్ మర్డర్లో భారత ప్రభుత్వ ఏజెంట్లు ఉండి ఉంటారని ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం రెండు దేశాలు తమ దౌత్యవేత్తలను వెలివేశాయి. ఇంతకీ నిజ్జార్ ఎవరో పూర్తిగా తెలుసుకుందాం.
ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జార్ను జూన్ 18వ తేదీన హత్య చేశారు. కెనడాలోని ఓ గురుద్వారాలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని చంపేశారు. 1997లో అతను కెనడాకు వలస వెళ్లాడు. శరణార్ధిగా ఉండేందుకు అతను పెట్టుకున్న అభ్యర్థనను తోసిపుచ్చారు. ఇమ్మిగ్రేషన్ కల్పించిన మహిళనే అతను పెళ్లాడాడు. అయినా అతనికి రెఫ్యూజీ ఇచ్చేందుకు నిరాకరించారు.
2020లో నిజ్జార్ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించారు. నిషేధిత కేటీఎఫ్ గ్రూపు కోసం నిజ్జార్ రిక్రూట్మెంట్ చేసేవాడు. శిక్షణ ఇచ్చేవాడు. సిక్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద గ్రూపును నడిపారు. సెప్టెంబర్ పదో తేదీన ఖలిస్తానీ రెఫరెండం కూడా నిర్వహించారు. నిజ్జార్కు ఉగ్రవాద లింకులు ఉన్నట్లు గతంలో పలుమార్లు కెనడాకు భారత్ విజ్ఞాపన చేసింది. 2018లో అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్.. వాంటెడ్ లిస్టును ట్రూడోకు అందజేశారు. ఆ జాబితాలో నిజ్జార్ పేరు కూడా ఉంది.
పంజాబ్ పోలీసులు 2022లో నిజ్జార్ను తమకు అప్పగించాలని కెనడాను కోరారు. రాష్ట్రంలో ఉగ్రవాద వ్యాప్తికి అతను సహకరిస్తున్నట్లు ఆరోపించారు. అనేక కేసుల్లో నిజ్జార్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2007లో లుథియానాలో జరిగిన పేలుళ్ల కేసులో అతను నిందితుడు. ఆ పేలుళ్లలో ఆరుగురు మృతిచెందారు. 42 మంది గాయపడ్డారు. 2010 పాటియాలా బాంబు బ్లాస్ట్ కేసులోనూ నిందితుడు. హిందు నేతల్ని టార్గెట్ చేసిన కేసులో అతను వాంటెడ్. 2015లో ఆ కేసు నమోదు అయ్యింది. 2015లో అతని కోసం లుకౌట్ నోటీసులు, 2016లో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. 2022లో నిజ్జార్ను చంపిన వారికి 10 లక్షల రివార్డును ప్రకటించారు.