న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ను ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థల ద్వారా సరఫరా నిలిపివేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శనివారం తెలిపింది. మంచి తయారీ పద్ధతులకు అనుగుణంగా సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడానికి, తనిఖీలో గుర్తించిన లోపాలను తయారీ సంస్థ సరిదిద్దుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో కొవాగ్జిన్ టీకా సరఫరా పొందిన దేశాలు ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్వో సూచించింది. అయితే ఏం చర్యలు తీసుకోవాలి అన్నది స్పష్టం చేయలేదు.
కాగా, కొవాగ్జిన్ వ్యాక్సిన్ సామర్థ్యం, ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. భద్రతాపరమైన సమస్యలు కూడా లేవని తెలిపింది. మార్చి 14 నుండి 22 వరకు నిర్వహించిన పోస్ట్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయుఎల్) తనిఖీ ఫలితాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఐరాస ద్వారా ఎగుమతిని డబ్ల్యూహెచ్వో నిలిపివేయడం వల్ల కొవాగ్జిన్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నది.
మరోవైపు డబ్ల్యూహెచ్వో చర్యపై హైదరాబాదీ తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పందించింది. తమ కరోనా టీకా కొవాగ్జిన్ సామర్థ్యం, భద్రతపై ఎలాంటి ప్రభావం లేదని శనివారం తెలిపింది. ఇప్పటి వరకు లక్షలాది మంది కొవాగ్జిన్ టీకా తీసుకున్నారని, ఈ మేరకు జారీ చేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్లు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయని పేర్కొంది. అయితే ఆప్టిమైజేషన్ కోసం టీకాల ఉత్పత్తిని కొంతమేర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.