న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్కు కారణమని నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే. మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో ఈ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఇదే కరోనా చివరి రూపాంతరమని, మహమ్మారి నుంచి ఇక స్వేచ్ఛ లభించిందని అనుకోవడానికి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కొవిడ్ కొత్త వేరియంట్ల ముప్పు ఇంకా పోలేదని, శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. భవిష్యత్లో రాబోయే కొత్త వేరియంట్లు ఇంకా ప్రభావవంతంగా, ప్రమాదకరంగా ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ (WHO) కొవిడ్ -19 టెక్నికల్ హెడ్ మారియా వాఘన్ పేర్కొన్నారు.
కొత్త వేరియంట్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలిగించే అవకాశం ఉంటుందని, ఇప్పటికే ఉన్న ఒమిక్రాన్ను అధిగమించే అవకాశం ఉందని.. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలిపారు. వైరస్ తనంతటతానుగా మారుతుందని, ఏ వైరస్ అయినా ప్రకృతిలో జీవించేందుకు తనను తాను మార్చుకుంటూ ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని వైరస్లలో తక్కువ మార్పులు కనిపిస్తాయని.. మరికొన్ని వైరస్లు రోగనిరోధక శక్తి, టీకాలకు దొరకకుండా మార్పులు చేసుకుంటాయని చెప్పారు. కరోనా డెల్టా, ఒమిక్రాన్ ఇలాంటి వేరియంట్లేనని చెప్పారు.
ఒమిక్రాన్ ప్రభావం భారత్లో ఎక్కువగా కనిపించనప్పటికీ.. పలు దేశాల్లో భారీగా ప్రభావం చూపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒమిక్రాన్ వేరియంట్ను నవంబర్లో క్రిటికల్ వేరియంట్గా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐదులక్షల మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 130 మిలియన్ల మందికి సోకింది. ఒమిక్రాన్ అత్యంత వేగంగా సోకుతుందని మొదటి నుంచి నిపుణులు అంచనా వేస్తూనే వచ్చారు.
ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా యాక్టివ్లోనే ఉన్నది. డెల్టాతో పోలిస్తే భారత్లో పెద్దగా నష్టాన్ని కలిగించనప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం కేసులను పరిశీలిస్తే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్సిడెంట్ మేనేజర్ అబ్ది మహమూద్ మరణాలపై విచారం వ్యక్తం చేశారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో పీక్ స్టేజీకి చేరలేదని లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ చీఫ్ మరియా వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా వేరియంట్ కారణంగా మరణాల సంఖ్య పెరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.