ముంబై: ఇంటి టెర్రస్ నుంచి ఈల వేయడం మహిళ పట్ల లైంగిక వేధింపు కాదని హైకోర్టు తెలిపింది. దంపతులు నమోదు చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇచ్చింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో నివాసం ఉండే పొరుగింటికి చెందిన లక్ష్మణ్, యోగేష్, సవితా పాండవ్పై ఒక మహిళ, ఆమె భర్త కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యోగేష్ అనే వ్యక్తి తన హుందాతనాన్ని కించపరిచేలా ప్రవర్తించినట్లు ఆ మహిళ ఆరోపించింది. 2021 నంబర్ 28న తనను మొబైల్లో వీడియో రికార్డు చేశాడని, దీనిని తన భర్త గమనించినట్లు పేర్కొంది. దీని గురించి ఇంటి యజమానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. తన, కుటుంబ సభ్యుల వీడియో క్లిప్లను పొరుగువారికి చూపించి తమ పరువు తీసేలా ప్రవర్తించడంతోపాటు కులాన్ని కించపరిచేలా మాట్లాడినట్లు ఆరోపించింది. అయితే దీని గురించి తాను పట్టించుకోలేదని ఆమె పేర్కొంది.
కాగా, 2022 మార్చి 21 నుంచి 23 మధ్య ఇంటి టెర్రస్ నుంచి యోగేష్ ఈల వేయడంతోపాటు పలు శబ్ధాలు చేశాడని, బైక్ హారన్ చేశాడని ఆ మహిళ ఆరోపించింది. తన రోజువారీ కార్యక్రమాలు రికార్డు చేసేలా సీసీటీవీ కెమేరాను ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మార్చి 24న యోగేష్, అతడి కుటుంబ సభ్యులు తనపై రాళ్లు విసరసగా తాను గాయపడినట్లు చెప్పింది. దీనిని ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారని, కేసు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆరోపించింది.
మరోవైపు ఆ మహిళపై కేసు నమోదు చేసిన మూడు నెలల తర్వాత భర్తతో కలిసి ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నిందితుల తరుఫు న్యాయవాది తెలిపారు. దీంతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు. ముందస్తు బెయిల్కు దిగువ కోర్టు నిరాకరించడంతో బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ను ఆశ్రయించినట్లు చెప్పారు. పాండవ్ కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటిని ఆ మహిళ, ఆమె భర్త కొనుగోలు చేయాలని భావించారని, అయితే ఇంటి యజమాని ముందుకు రాకపోవడంతో కులం పేరుతో దూషించడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అద్దెకు ఉంటున్న వారిపై కేసు పెట్టారంటూ కోర్టులో వాదించారు.
కాగా, ఇరువైపు వాదనలు విన్న కోర్టు ఆ మహిళ, ఆమె భర్త దురుద్దేశంతో నిందితులపై కుల దూషణ కింద కేసు నమోదు చేసినట్లు అభిప్రాయపడింది. ఆ మహిళ ఫిర్యాదుకు ముందే నిందిత కుటుంబం ఆమెపై ఫిర్యాదు చేసిన విషయాన్ని విస్మరించలేమని పేర్కొంది. అలాగే ఒక వ్యక్తి తన ఇంట్లో శబ్దాలు చేయడం, టెర్రస్ నుంచి ఈల వేయడం ఆ మహిళ పట్ల లైంగిక వేధింపుల ఉద్దేశంతోనే అని ఊహించలేమని తెలిపింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.