మొహాలీ: ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ పంజాబ్లోని మొహాలీ జిల్లాలో ఓ బిల్డింగ్లో తనిఖీలు(ED Raids) చేసింది. ఖారర్ రెసిడెన్షియల్ సొసైటీలో ఉన్న ఓ బిల్డింగ్లో సోదాలు జరిగాయి. అయితే ఆ సమయంలో బిల్డింగ్లోని 9వ అంతస్తు నుంచి నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్ను కిందపడేశారు. రూ.500 నోట్లు ఆ బ్యాగుల్లో ఉన్నట్లు గుర్తించారు. రెండు బ్యాగ్లను బిల్డింగ్ మీద నుంచి కిందపడేశారు. చాజు మజ్రాలో ఉన్న వెస్ట్రన్ టవర్స్ ఫ్లాట్ నెంబర్ 906లో రెయిడ్స్ జరిగినట్లు ఢిల్లీ అధికారులు చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో రెండు బ్యాగులను పైనుంచి కిందకు పడేశారు.
మొహాలీతో పాటు చండీఘడ్లోని 12 కేంద్రాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బిల్డర్లు, హౌజింగ్ ప్రాజెక్టులకు చెందిన వ్యక్తలు ఇండ్లల్లో సోదాలు చేపట్టారు. ఓ ప్రభుత్వ అధికారికి సన్నిహితంగా ఉన్న నితిన్ గోహల్ నివాసం వద్ద కూడా తనిఖీలు జరిగాయి. గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ లైసెన్సు పొందేందుకు భారీ భూ అక్రమ దందా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసి వందల కోట్లు ఆర్జించినట్లు కూడా ఫిర్యాదులు నమోదు అయ్యాయి. సన్టెక్ సిటీ ప్రాజెక్టు, ఆ కంపెనీ ప్రమోటర్ అజయ్ సెహగల్, ఏబీఎస్ టౌన్షిప్స్ ప్రైవేటు లిమిటెడ్, ఆల్టస్ బిల్డర్స్, ధిర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పరిసరాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించారు.
జీమాడా ఫీజుల అంశంలో డిఫాల్టర్లకు నితిన్ గోహెల్ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిఫాల్టర్లకు రాజకీయంగా రక్షణ కల్పించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఖారర్లో ఉన్న ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రూ.500 కరెన్సీ నోట్లను బిల్డింగ్ సమీపంలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు.