శ్రీనగర్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కళ్లు తిరుగడంతో పడిపోబోయారు. ఖర్గే పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ నేతలు వెంటనే ఆయనను పట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జమ్ముకశ్మీర్లోని కతువాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై మండిపడ్డారు. ‘ఈ వ్యక్తులు (కేంద్ర ప్రభుత్వం) ఎన్నడూ ఎన్నికలు నిర్వహించాలని కోరుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశం తర్వాతే ఎన్నికలకు సిద్ధమయ్యారు. వారికి ఎన్నికలు అవసరం లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రిమోట్ కంట్రోల్తో ప్రభుత్వాన్ని నిర్వహించాలనుకున్నారు’ అని విమర్శించారు. ప్రధాని మోదీ పదేళ్లలో భారతీయ యువతకు ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు. ‘పదేళ్లలో మీ శ్రేయస్సును తిరిగి తీసుకురాలేని వ్యక్తిని మీరు నమ్ముతారా? బీజేపీ నేత మీ ముందుకు వస్తే మీ శ్రేయస్సు గురించి అడగండి’ అని అన్నారు.
కాగా, మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ అస్వస్థతకు గురయ్యారు. బీపీ పడిపోవడంతో ఆయనకు కళ్లు తిరిగాయి. వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలు దీనిని గమనించారు. వెంటనే ఆయన వద్దకు చేరుకుని పట్టుకున్నారు. అయినప్పటికీ ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి తాము పోరాడుతామని అన్నారు. ‘నాకు 83 ఏళ్లు. నేను అంత త్వరగా చనిపోను, ప్రధాని మోడీని అధికారం నుంచి తొలగించే వరకు నేను బతికే ఉంటాను’ అని అన్నారు. అనంతరం కాంగ్రెస్ నేతలు ఖర్గేను ఆయన సీటు వద్దకు తీసుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Jammu and Kashmi: Congress President Mallikarjun Kharge became unwell while addressing a public gathering in Kathua. pic.twitter.com/OXOPFmiyUB
— ANI (@ANI) September 29, 2024