న్యూఢిల్లీ: చైనా యుద్ధ విమానాలను సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కి దగ్గరగా గుర్తించిన వెంటనే తాము చాలా వేగంగా స్పందిస్తామని, ఫైటర్ విమానాలతోపాటు అన్ని వ్యవస్థలను హై అలెర్ట్ చేస్తామని భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. జూన్ చివరి వారంలో చైనా యుద్ధ విమానం ఎల్ఏసీ ప్రాంతంలో కొన్ని నిమిషాల పాటు తిరిగింది. దీంతో భారత రాడార్లు గుర్తించి అలెర్ట్ చేశాయి. వెంటనే భారత ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగడంతో చైనా యుద్ధ విమానం తోక ముడిచింది.
కాగా, తూర్పు లడఖ్ సరిహద్దులో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు భారత్, చైనా మధ్య 16వ విడత ఉన్నత స్థాయి సైనిక చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి, ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. సరిహద్దులో చైనా ఘర్షణ వైఖరిని ప్రస్తావించారు. ఎల్ఏసీ గగన తలంలో ఐఏఎఫ్ నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ‘చైనీస్ ఎయిర్క్రాఫ్ట్ ఏల్ఏసీకి కొంచెం దగ్గరగా వస్తున్నట్లుగా గుర్తించినప్పుడల్లా తగిన చర్యలు చేపడతాం. ఫైటర్ విమానాలను రంగంలోకి దించడంతోపాటు అన్ని వ్యవస్థలను హై అలర్ట్లో ఉంచుతాం. ఇలా చైనా విమానాలను అడ్డుకుంటాం’ అని తెలిపారు. అయితే చైనా ప్రతిసారి ఇలాంటి కవ్వింపులకు ఎందుకు దిగుతుందో అన్న దానికి సరైనా కారణం కనిపించడం లేదన్నారు.
మరోవైపు సైనిక దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ విధానమైన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే అగ్నిపథ్ కోసం 7.5 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఆర్మీలో చేరడంపై యువత మక్కువకు ఇది నిదర్శనమని ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి తెలిపారు. భారీగా దరఖాస్తులు రావడంతో డిసెంబర్ నాటికి సెలక్షన్ ప్రక్రియ ముగించి శిక్షణ ప్రారంభించడం తమ ముందున్న పెద్ద సవాల్ అని అన్నారు. అలాగే ఈ ఏడాది ఎయిర్ ఫోర్స్ డే పరేడ్ను ఢిల్లీలో కాకుండా చండీగఢ్లో నిర్వహిస్తామని తెలిపారు. ఇకపై ప్రతి ఏటా వార్షిక పరేడ్ వేదికను మార్చాలని నిర్ణయించామన్నారు.
#WATCH Air activity across LAC is continuously monitored by us. Whenever we find Chinese aircraft coming a little too close to LAC, then, we take appropriate measures by scrambling our fighters & putting our systems on high alert. This has deterred them: IAF chief pic.twitter.com/ATWimMMs5G
— ANI (@ANI) July 17, 2022