Priyanka Gandhi | వేల సంవత్సరాల క్రితం రావణుడిపై యుద్ధం చేసినప్పుడు శ్రీరాముడు నిజం కోసం పోరాడారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాధ్రా పేర్కొన్నారు. రావణుడిపై యుద్ధం చేసినప్పుడు ఆయనకు అధికారం, వనరులు, కనీసం రధం కూడా లేదని చెప్పారు. రావణుడికి రధాలు, వనరులు, సైన్యం, బంగారం ఉన్నా.. రావణుడిపై యుద్ధం చేసిన శ్రీరాముడు నిజం, నమ్మకం, ప్రేమ, దయ, వినయం, సహనం, ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. అధికారం శాశ్వతం కాదని కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి చెబుతున్నానని అన్నారు. అహంకారం కూలిపోతుందన్నారు.
ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఆదివారం విపక్ష కూటమి ‘ఇండియా’ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రామాయణాన్ని గుర్తు చేస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రియాంకగాంధీ వధ్రా విమర్శలు గుప్పించారు. తన చిన్నతనంలో ప్రతియేటా తన నానమ్మ ఇందిరతో రాంలీలా మైదాన్కు వచ్చేదానినని గుర్తు చేశారు. ప్రతియేటా రాం లీలా మైదాన్ లో రావణుడి దిష్టిబొమ్మ దహనం చెప్పినప్పుడల్లా తన నానమ్మ ఇందిరా తనకు రామాయణం గురించి చెప్పేవారని అన్నారు. నిజం కోసం పోరాడే ఇండియా కూటమికి అధికారం అక్కర్లేదన్నారు.