లక్నో : కొవిడ్-19 చికిత్సలో దీటుగా పనిచేస్తుందని చెబుతున్న విరాఫిన్ డ్రగ్ మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్ లో అందుబాటులోకి రానుంది. లక్నో, వారణాసి, ప్రయాగరాజ్ జిల్లాల్లో ఒక్కో దవాఖానకు ఈ మందు రోగులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ప్రబలుతున్న క్రమంలో సమర్ధవంతంగా పనిచేసే ప్రత్యామ్నాయ చికిత్సల కోసం భారత శాస్త్రవేత్తలు అహరహం శ్రమిస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పారు. కొవిడ్ తో మరణించిన వారికి నిబంధనల ప్రకారం వారి మతాచారాలకు అనుగుణంగా అంత్యక్రియలు జరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహమ్మారితో బాధపడుతూ మరణాలు చోటుచేసుకోవడం బాధాకరమని, ప్రతి ఒక్క మరణం రాష్ట్రానికి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.